
ఏటూరునాగారం ములుగు జిల్లా ఏప్రిల్ 26 (ది టైమ్స్ ఆఫ్ తెలంగాణ)
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం-2025 ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు.శనివారం ఐటిడిఏ, ఏటూరు నాగారం కార్యాలయం లో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. హాజరయ్యారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందని, తద్వారా ఎంతోమంది రైతుల సమస్యలు పరిష్కరించ బడతాయని తెలిపారు. చట్టంలో కీలకమైనది అప్పీలు వ్యవస్థ అని,ఎవరైనా రైతుకు అన్యాయం జరిగినట్లయితే ఆపిల్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు.తహసిల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్,
సి సి ఎల్ ఎ స్థాయిలలో అప్పిలు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాలలో చాలావరకు భూమి హద్దుల గొడవలు ఉంటాయని,కానీ భూభారతిలో రీ సర్వే, కొనుగోలు, పాలు పంపకాలు, దస్తావేజులు,విరాసట్ పట్టా మార్పిడికి తప్పనిసరిగా కమతం జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని తెలిపారు. భూభారతి చట్టంలో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉందని,గతంలో గ్రామాలలో గ్రామ పరిపాలన, వి ఆర్ ఓ / వి.ఆర్.ఏ వ్యవస్థ ఉండేవని, వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేయడం వల్ల గ్రామాలలో భూ సమస్యలు పెరిగాయని, త్వరలో గ్రామ పాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు.విరాసత్ మార్పిడికి వారసులకు అందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఉందని, భవిష్యత్తులో ఎలాంటి గొడవలు ఉండవని తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టంలోని అంశాల పట్ల అవగాహన చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వర్,మండల అధికారులు,రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.